నన్నయకు శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, వాగనుశాసనుడు అను బిరుదులున్నాయి. సంస్కృత, ఆంధ్రభాషయందు
పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం
(ముగ్గురు కవులు) లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా
ప్రసిద్ధిచెందింది. మహాభారతానికి తెలుగు సాహిత్యంలో ఎంతో సాహితీపరమైన విలువ కలిగి
ఉంది.
నన్నయ సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి రచించారని భావిస్తారు. నన్నయ భారతంలోని అత్యుత్తమ, అత్యంత అభివృద్ధి
చెందిన భాషను గమనిస్తే, నన్నయ భారతానికి పూర్వమే తెలుగు సాహిత్యంలో రచనలు
ఉండి వుంటాయన్న సూచన కలగుతుంది. ఐతే తెలుగు సాహిత్యాభివృద్ధికి నన్నయే ముఖ్యుడన్న
విషయాన్ని నన్నయకు, తిక్కనకు మధ్యకాలంలోని కవుల ఎందరో తెలియచేసారు.
అటువంటి మహోత్క్రుష్టమైన కవీశ్వరుడికి ఈ ఆధునిక యుగములో కూడా మన తపాలా శాఖ వారు,
నన్నయ గారి విశేష భాషా సేవకు చిహ్నముగా, ఉడుతా భక్తిగా ఆయన పేరిట తపాలా బిళ్ళ
విడుదల చేయటం మన అందరికీ గర్వకారణం.
రాజరాజనరేంద్రునిపరిపాలనలో కవిత్రయంలో మెదటివాడైన నన్నయ్య ఇక్కడే గోదావరి ఒడ్డున శ్రీ మహాభారతం తెనుగించడం ప్రారంభించారు. ఈ నగరం
"మహాభారతము" తెలుగు భాషలో పుట్టిన ప్రదేశము.
నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రాయడం మొదలుపెట్టి, అందులో మొదటి రెండు ఆది, సభా పర్వాలను పూర్తి చేసి, తరువాత పర్వాన్ని
(అరణ్య పర్వం) సగం రాసి కీర్తిశేషుడయ్యాడు. నన్నయ తెలుగు భాషకు ఒక మార్గాన్ని
నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నన్నయ్య అడుగు
జాడలను అనుసరించినవారే. నన్నయ్య రాజమహేంద్రవరం లేదా రాజమండ్రిలో ఉండి ఈ మహా
భారతాన్ని తెలుగులో రచించాడు. తల్లి గోదావరి ఒడ్డున కూర్చొని, తన రాజయిన రాజరాజనరేంద్ర మహారాజు గారికి చెప్పినదే ఈ మహాభారతము. రాజరాజనరేంద్రుని
పాలన క్రీ.శ. 1045-1060 మధ్య కాలంలోనే
భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది.
తెలుగు
తోట ఒక నందన వనం. ఇందులో జానపదాలు
విరిసాయి, ప్రబంధాలు మెరిసాయి. కాలక్రమముగా పూల రంగులు, పరిమళాలు మారుతున్నాయి
కాని మన తెలుగు తోట అనునిత్యం అదే సుగంధాన్ని వెదజల్లుతోంది. సాహిత్య సుందరి భారీ ఆభరణాలను విడిచిపెట్టి
నాజూకుతనాన్ని అలవరచుకుంది. బృహత్కావ్యాలు సన్నబడి చిన్న కవితలయ్యాయి. చక్కనమ్మ
చిక్కినా అందమే. అందుకే శంకరంబాడి
సుందరాచారి గారు “మా తెలుగు తల్లికి మల్లెపూదండ! మా కన్న తల్లికి మంగళారతులు”
అన్నారు. కన్నతల్లిని ఎందుకు
ప్రేమించాలన్న సందేహం బిడ్డకు రాదు. బిడ్డను ఎందుకు హత్తుకోవాలన్న ప్రశ్న తల్లికి
రాదు. అదీ తెలుగుభాషకూ మనకూ గల అనుబంధం. తెలుగు-వరాల తెలుగు, సుస్వరాల తెలుగు,
తెలుగు నవరసాల తెలుగు. తేనె కన్నా మధురం తెలుగు, మా కంటికి వెలుగు అని ఆరుద్ర గారు
అన్నారు. చందమామ రావె, జాబిల్లి రావె అంటూ
అన్నమయ్య ఆలపించింది ఏడుకొండలవాడి కోసం! ఏళ్లకేళ్ళుగా ఎన్నో తరాలుగా తల్లులు
వకుళమాతలై, యశోదలై తమ బిడ్డలకు ఈ పాటలు పాడుతూ అన్నమయ్యతో గొంతు కలపడం తెలుగు
భాషకు అక్షరాభిషేకం చేసినట్లే.

